Telugu Rekha Media - రాష్ట్రీయం / హైదరాబాద్ : గొలుసుకట్టు చెరువులన్నీ పునరుద్ధరిస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. చెరువులకు నీటిని మళ్లించే నాలాలు పూడుకుపోయాయని, అవకాశవాదం వల్ల గొలుసుకట్టు చెరువులన్నీ మాయమయ్యాయని, చెరువు ఎఫ్టిఎల్, బఫర్ జోన్లో ఎవరూ స్థలాలు కొనుగోలు చేయవద్దని సూచించారు. సోమవారం రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. చెరువుల పరిరక్షణకు అందరితో కలిసి మేథోమదనం చేస్తామని, పార్కు స్థలాలు పరిరక్షించే కాలనీ సంఘాలను సమర్థిస్తామని, పార్కు స్థలాల్లో ఫెన్సింగ్ వేసేందుకు కాలనీ సంఘాలు సహకరిస్తున్నామని, బస్తీ వాసుల మెరుగైన జీవన ప్రమాణాలు పెరగాలని, నందగిరి హిల్స్ సొసైటీతో మాకు ఎలాంటి ఒప్పందం లేదని, చందానగర్లో గతేడాది బఫర్ జోన్లో నిర్మాణాలకు అనుమతులిచ్చారని, ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేస్తే హైడ్రా చర్యలు తప్పవని రంగనాథ్ హెచ్చరించారు.క్షేత్రస్థాయిలో మెరుగైన ఫలితాలు చూస్తారని, బఫర్ జోన్, ఎఫ్టిఎల్ పరిధిలో నిర్మాణాలు కట్టాలంటే భయపడే స్థితికి తీసుకొస్తామని హెచ్చరించారు. అక్రమంగా అనుమతులు ఇచ్చే అధికారులపై విచారణ చేసి ప్రభుత్వానికి వివరిస్తామన్నారు. జిహెచ్ఎంసి పరిధిలో చెరువులు, కుంటలు అన్నీ కలిపి 400కిపైగా ఉన్నాయని, హైడ్రా చెరువలను ప్రధానంగా తీసుకుందని, ఎన్ఆర్ఎస్సి నివేదిక ప్రకారం 44 ఏళ్లలో చాలా చెరువు కనుమరుగు అయ్యాయని, చాలా చెరువులు 60 శాతం, కొన్ని 80 శాతం అక్రమణలకు గురయ్యాయని, దీంతో చెరువుల పరిధిలోని ఆక్రమణలను గుర్తిస్తున్నామని, చెరువల ఆక్రమణలను అడ్డుకోకపోతే హైదరాబాద్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోందని రంగనాథ్ పేర్కొన్నారు. త్వరలోనే హైడ్రాకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సిబ్బందిని సమకూరుస్తుందని, హైడ్రాకు త్వరలోనే ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఉంటుందని, ప్రజల నుంచి హైడ్రాకు వందలాది ఫిర్యాదులు వస్తున్నాయని వివరించారు. 2500 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో హైడ్రా పరిధిలో ఉందని, దశల వారీగా హైడ్రా పని చేస్తుందని తెలియజేశారు. తొలి దశలో ఆక్రమణలను అడ్డుకోవడం హైడ్రా చేసే పని అని, రెండో దశలో ఆక్రమించి నిర్మించిన భవనాలపై చర్యలు, అనుమతుల నిరాకరణ ఉంటుందని, మూడో దశలో చెరువుల పూడిక తీసి వాన నీటిని మళ్లించి పునర్జీవనం కల్పించడం జరుగుతుందని ఆయన వివరణ ఇచ్చారు.
Reporter
Telugu Rekha Media