Telugu Rekha Media - ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (MGNREGS) రాష్ట్రంలో పకడ్బందిగా అమలు చేయాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ప్రణాళిక బద్దంగా పనులు చేయించాలని సూచించారు. రైతుల ఆదాయం పెంచేలా, ఉపాధి హమీ నిధులతో వ్యవసాయ అనుబంధ పనులకు ప్రధాన్యత ఇవ్వాలన్నారు. శాశ్వతంగా నిలిచేలా ఉపాధి హమీ పనులు చేపట్టాలన్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. రాష్ట్రంలో MGNREGS అమలు పై పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క శుక్రవారం నాడు సమీక్షా సమావేశం నిర్వహించారు. సచివాలయంలో తన చాంబర్ లో పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, కమీషనర్ అనితా రామచంద్రన్, స్పెషల్ కమీషనర్ షఫిఉల్లా, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కాంతి వెస్లీ, పంచాయతీ ఇంజనీరింగ్ విభాగం ఈఎన్సీ కనకరత్నం, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి సీతక్క బేటి అయ్యారు. రాబోయే 5 నెలల కాలానికి సంబంధించి రూ. 1372 కోట్ల MGNREGS లో నిధులతో చేపట్టే పనుల ప్రణాళికలకు ఆమోదం తెలిపారు. మహిళలకు ఉపాధి భరోసా, పంటపొలాలకు బాటలు, పండ్ల తోటల పెంపకం, వర్షపు నీటిని ఒడిసి పట్టడం, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కింద చేపట్టే పనులను ఫైనలైజ్ చేసారు. రూ. 106 కోట్ల నిధులతో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద ప్రతి నియోజకవర్గానికి సుమారు కోటి నిధులను వెచ్చించాలని నిర్ణయించారు. మొత్తం 5,400 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆదాయాన్ని పెంచే దిశలో పశువుల కొట్టాలు, కోళ్ళ షెడ్ల నిర్మాణాం, వర్మి కొంపోస్ట్-వాన పాముల ఎరువుల తయారీకి తోట్ల నిర్మాణం, SHG లో ఉన్న రైతుల బీడు భూములను అభివృద్ధి చేసి సాగులోకి తీసుకొచ్చే ప్రణాళిలకు మంత్రి సీతక్క ఆమోదం తెలిపారు.
Admin
Telugu Rekha Media