Telugu Rekha Media - జిల్లా వార్తలు / శ్రీశైలం : ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వాముల వారి శ్రీశైల దేవస్థానంలో నాగులచవితిని కొన్ని ప్రాంతాలలో శ్రావణమాసంలో ఆచరిస్తుండగా, మరికొన్ని చోట్ల కార్తీకమాసంలో ఆచరిస్తున్నారు. ఈ కారణంగా శ్రావణ శుద్ధ చవితి అయిన పలువురు భక్తులు ఆలయ ప్రాంగణంలోని నాగులకట్ట వద్ద నాగదేవతలను పూజించారు. ఈ రోజు వేకువజాము నుండి భక్తులు నాగులకట్ట వద్దకు చేరుకొని పత్తితో చేసిన వస్త్రం, యజ్ఞోపవీతం, పలురకాల పుష్పాలు మొదలైన వాటితో నాగమూర్తులను అలంకరించి పాలతో అభిషేకించారు. తరువాత నువ్వులపిండి, చలిమిడి, వడపప్పులను నివేదించారు. కాగా మన సంస్కృతిలో నాగసంప్రదాయానికి ఎంతో ప్రాముఖ్యం వుంది. అదేవిధంగా శ్రీశైలంలో కూడా పలుచోట్ల నాగవిగ్రహాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఆలయ ప్రాకారంపై పలుచోట్ల నాగశిల్పాలను దర్శించవచ్చు. ఈ నాగశిల్పాలలో తూర్పు ప్రాకారంపై గల ఆదిశేషుడు, దక్షిణవైపున గల నాగబంధశిల్పం ముఖ్యమైనవి.
Reporter
Telugu Rekha Media