Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు ఇబ్బంది లేకుండా రైతు సేవా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేయడంతో పాటు నకిలీ విత్తనాల అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రగతిపై సంబంధిత అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో నకిలీ విత్తనాల బెడద అధికంగా ఉన్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అరికట్టేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు రైతులకు నాణ్యమైన విత్తనాలను సబ్సిడీపై సకాలంలో పంపిణీ చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. అలాగే రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులకు కూడా కొరతలేదని రైతులకు అవసరమైన ఎరువులను సకాలంలో రైతులకు పంపిణీ చేయాలన్నారు. జిల్లాలో దాదాపు 3 లక్షల మంది రైతులు ఉన్నారని అందులో 30 శాతం మంది కౌలు రైతులు ఉన్నట్లు చెబుతున్నారని వీరందరికీ పంట రుణాలు ఇప్పించడంలో ప్రత్యేక చొరవ చూపాలని వ్యవసాయ అధికారులను ఆమె ఆదేశించారు. ఇన్పుట్ సబ్సిడీ, పీఎం కిసాన్ కింద పెండింగ్ లో ఉన్న బకాయిలను చెల్లింపుకు ఉన్న సాంకేతిక అడ్డం కులం తొలగించి చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. జూలై మాసంలో అత్యల్ప వర్షపాతం నమోదైనందున ఆగస్టు చివరి వరకు సాగు చేసుకునే అవకాశం ఉందని.... ఈలోగా రైతులకు అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులపై అవగాహన కల్పించి విత్తనాలు, ఎరువులు సరఫరా చేయాలన్నారు. నకిలీ సీడ్స్ ఉత్పత్తులు, సరఫరాపై విస్తృత దాడులు నిర్వహించి సంబంధిత విక్రయదారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలో ఉద్యాన పంటల కింద 40 వేల హెక్టార్లలో సాగుతున్న పండ్ల తోటల పెంపకాన్ని మరింత విస్తృత పరిచేందుకు అవకాశం ఉందని ఈ మేరకు రైతులను ప్రోత్సహించి చర్యలు తీసుకోవాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారిని ఆదేశించారు. జిల్లాలోనీ భూములు వినూత్న పంటల ఉత్పత్తులకు అపార అవకాశాలు ఉన్నాయని 90 వేల హెక్టార్ల విస్తీర్ణంలో పండ్ల తోటల ఉత్పత్తికి అవకాశం ఉందని ఉద్యాన పంటల వైపు రైతులను ప్రోత్సహించాలన్నారు. ఆయిల్ ఫామ్ సాగుతో పాటు ఇతర ఉద్యాన పంట ఉత్పత్తుల దిగుబడులకు కూడా పైమార్కెటింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే జిల్లాలో పశు సంపద ప్రోత్సహించి పాడి పారిశ్రమాభివృద్ధికి చర్యలు తీసుకోవడంతోపాటు, క్రమం తప్పకుండా వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలన్నారు. 400 ఎకరాలలో సాగుతున్న పట్టు పరిశ్రమ అభివృద్ధికి కూడా చర్యలు తీసుకోవాలని డిడి సెరికల్చర్ ను ఆదేశించారు.
కృష్ణా, కుందూ నది పరీవాహక ప్రాంతాలలోని రిజర్వాయర్లో చేపల ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో చేపల ఉత్పత్తికి అవకాశం ఉన్నప్పటికీ వినియోగం తక్కువగా ఉందని సీడ్ ప్రొడక్షన్, సొసైటీలను పటిష్టం చేసి మత్స్య సంపద పెంపుదలకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు, 124 మైనర్ ఇరిగేషన్ ట్యాంకుల ద్వారా నీటి లభ్యతను బట్టి సాగునీరు అందించే విషయంపై రైతులకు అవగాహన కల్పిస్తూ అందుకు అనుగుణంగా పంటలు వేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి కృష్ణమూర్తి, ఉద్యాన శాఖ అధికారి నాగరాజు, ఏపిఏంఐపి పిడి సత్యనారాయణ, ఇరిగేషన్ ఎస్ఈ వెంకటరమణ, మత్స్యశాఖ అధికారి రాఘవరెడ్డి, భూగర్భ జల శాఖ ఏడి రఘురాం తదితరులు పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media