Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : డా. బి.ఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని ఆసుపత్రి పాలై కోలుకుంటున్న నేపథ్యంలో సదరు డా. బి ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చేపడుతున్న బాత్ రూం లు, మరుగుదొడ్లు, ఎలక్ట్రికల్ తదితర మరమ్మత్తులు నాణ్యతగా పూర్తి స్థాయిలో చేయాలని, విద్యార్థుల బాధ్యత ఇక మీదట గురుకుల పాఠశాలలోని ప్రతి ఉపాధ్యాయులది, సిబ్బందిదని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని డా.బి ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో చేపడుతున్న బాత్ రూంలు, మరుగు దొడ్ల తదితర మరమ్మతులను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించి వాటి ఫ్లోరింగ్ పూర్తి తొలగించి టైల్స్ ఏర్పాటు, తలుపులు, ఎలక్ట్రికల్ వర్క్స్, రన్నింగ్ వాటర్ తదితరాలను నాణ్యతగా పూర్తి స్థాయిలో మరమ్మత్తులు చేయాలని సదరు పనులు చేపట్టిన ఇంజనీరింగ్ అధికారులను, మునిసిపల్ అధికారులను ఆదేశించారు. సదరు మరమ్మతులకు అంచనా విలువ సుమారు రూ. 56 లక్షలు కాగా ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ, తాడేపల్లి వారు రూ.25 లక్షలు విడుదల చేశారని, మిగిలిన మొత్తాన్ని ఏర్పాటు చేయనున్నామని పనులు నాలుగు ఐదు రోజుల్లో పూర్తి కావాలని కలెక్టర్ ఆదేశించారు. విద్యార్థుల తల్లి తండ్రులు ఎంతో నమ్మకంగా గురుకుల పాఠశాలలో వారి పిల్లలను ఉంచడం వలన మన బాధ్యత ఎక్కువగా ఉంటుందని, వారిని మన సొంత పిల్లల్లా జాగ్రత్తగా చూసుకోవాలని, విద్యార్థుల పూర్తి బాధ్యత ఇక మీదట గురుకుల పాఠశాలలోని ప్రతి ఉపాధ్యాయులది, సిబ్బందిదని నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఈఈ, ఏపీ ఈడబ్ల్యూఐడిసి బాలసుబ్రమణ్యం రెడ్డి, మునిసిపల్ కమిషనర్ జనార్ధన్ రెడ్డి, ఎంపిడిఓ మాధవి లత ఎఈ కళ్యాణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media