Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / అమరావతి : తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో వందల మంది నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వినతులు స్వీకరించారు. ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళుతున్న ముఖ్యమంత్రి...శనివారం ఉదయం పార్టీ కార్యాలయానికి వెళ్లారు. వేచి ఉన్న ప్రజలు, కార్యకర్తలను కలిశారు. ముందుగా గేటు వద్ద రాజమండ్రి నుంచి వచ్చిన దివ్యాంగుల నుంచి వినతిపత్రాలు తీసుకున్నారు. అనంతరం మీడియా రూంలో ప్రజలను, కార్యకర్తలను, వివిధ సమస్యలపై వచ్చిన వారిని కలిశారు. ఆరోగ్య సమస్యలు, భూ వివాదాలు, వ్యక్తి గత సమస్యలపై ప్రజలు సిఎంకు విన్నవించారు. కార్యకర్తలు, నేతలు నామినేటెడ్ పదవుల్లో తమకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరారు. నాడు తెలుగుదేశం ప్రభుత్వం లో పనిచేసిన బీమా మిత్రలు తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని కోరారు. విజయవాడకు చెందిన షేక్ ఆసిన్, మహ్మద్ ఇంతియాజ్ రాజధాని అమరావతి కోసం రూ.1 లక్ష విరాళంగా ఇచ్చారు. ఫర్నిచర్ షాపు నడుపుతున్న వీరు లక్ష విరాళం ఇవ్వడాన్ని చంద్రబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ ఆశోక్ బాబుతో సహా పలువరు నేతలు పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media