Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : భూమికి సంబంధించి ఆన్లైన్లో పేరు నమోదుకు ఓ వ్యక్తి నుంచి డబ్బును లంచంగా తీసుకున్న వజ్రకరూరు తహసీ ల్దార్ మహమ్మద్ రఫీని ఏసీబీ అధికా రులు వలపన్ని పట్టు కున్నారు. ఏసీబీ డీఎస్పీ జెస్సి ప్రశాంతి మాట్లాడుతూ.. వజ్రకరూరు మండలం, ధర్మపురి గ్రామానికి చెందిన మల్లికార్జున చాబాల గ్రామ పరిధిలో ఉన్న తన 5.50 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన ఆదినారాయణ రెడ్డి వద్ద కొన్నేళ్ల కిందట రిజిస్ట్రేషన్ అమ్మకం పెట్టాడు. మల్లికార్జున మృతి చెందడంతో కుటుంబ సభ్యులు భూమిని ఆదినారాయణ రెడ్డి అనే మరో వ్యక్తి కి అమ్మేశారు. ఆయన బెళుగుప్పకు చెందిన తన కుమార్తె సరళ పేరున భూమి బదలాయించారు. దానికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చాయి. కాని ఆన్లైన్లో పేరు నమోదు కాలేదు. పేరు నమోదు చేయాలని సరళ భర్త వెంకటేశ్ వజ్రకరూరు తహసీల్దార్ మహమ్మద్ రఫీని కలిశారు. అందుకు ఆయన రూ. లక్ష డిమాండు చేశారు. చివరికి రూ.70 వేలకు బేరం కుదుర్చుకున్నారు. తరువాత వెంకటేశ్ అనంతపురం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందుగా కుదుర్చు కున్న ఒప్పందం ప్రకారం నగదు చెల్లిస్తానని వెంకటేశ్ చెప్పడంతో తహసీల్దార్ వారి బంధువు ఫోన్ పే నంబరు ఇచ్చారు. ఆ నంబరుకు రూ.65 వేలు జమ చేయగానే ఏసీబీ అధికారులు తహసీల్దార్ ను అదుపులోకి తీసుకున్నారు.
Reporter
Telugu Rekha Media