Telugu Rekha Media - తెలంగాణ / సిద్ధిపేట : ప్రైవేట్, కార్పోరేట్ విద్యాసంస్థలలో విచ్చలవిడిగా కొనసాగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు భీమా సాహెబ్ ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం సంఘ కార్యాలయంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు బోడా మోహన్ నాయక్ అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో బీమా సాహెబ్ మాట్లాడుతూ జిల్లాలో రకరకాల ముద్దు పేర్లతో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్లు కాలేజీలు విద్యార్థులను తల్లిదండ్రులను మభ్యపెడుతూ విచ్చలవిడిగా ఫీజుల దోపిడీకి పాల్పడుతున్నాయని ఆరోపించారు. ఎలాంటి అనుమతులు లేకుండా, అనుభవం లేని ఉపాధ్యాయులను నియమించుకొని, కనీస సౌకర్యాలు కల్పించకుండా కేవలం లాభాల కోసమే విద్యాసంస్థలు నడుస్తున్నాయని అన్నారు. రోజురోజుకీ పేదలు మధ్యతరగతి వర్గాలకు విద్య అందకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఆగడాలపై జిల్లా విద్యాశాఖ అధికారులు కనీస పర్యవేక్షణ కూడా చేయడం లేదని, మామూళ్ల మత్తులో నిద్రపోతున్నారని అన్నారు. ప్రైవేట్ కార్పొరేట్ సంస్థల కట్టడికి జీవోనెంబర్ 1, 42 లను పకడ్బందీగా అమలు చేయాలని, తక్షణమే ఫీజుల నియంత్రణకు అసెంబ్లీలో చట్టం చేసుకోరావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. విద్య హక్కు చట్టం- 2009 ప్రకారం ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో గిరిజన దళిత పిల్లలకి 25% ఉచిత సీట్లు కేటాయించాలని ఉన్నప్పటికీ పాటించడం లేదని అన్నారు తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో నగర కార్యదర్శి రవీందర్ నాయక్, జిల్లా నాయకులు లక్ పతి నాయక్ , శ్రీనివాస్ నాయక్, రమేష్ నాయక్, సురేష్, రాజు, ప్రకాష్ నాయక్, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media