Telugu Rekha Media - తెలంగాణ / పెద్దపల్లి/మంథని : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులను కల్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ముత్తారం మండలం ముత్తారం, లక్కారం గ్రామాలలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పోతారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను తనిఖీ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులను, పాఠశాలలోని టాయిలెట్లు, భోజన శాల, కిచెన్ ఏరియాను కలెక్టర్ పరిశీలించారు. పాఠశాలలోని తరగతి గదులను తనిఖీ చేసి ప్రాథమిక తరగతుల విద్యార్థుల కనీస విద్యా ప్రమాణాలను కలెక్టర్ పరీక్షించారు. విద్యార్థుల కనీస విద్యా ప్రమాణాలపై ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని, పిల్లలకు తప్పనిసరిగా చదవడం, రాయడం, బేసిక్ మ్యాథ్స్ రావాలని అన్నారు. లక్కారం గ్రామంలోని పాఠశాల ప్రహారి గోడ పాక్షికంగా దెబ్బతినడం గమనించిన కలెక్టర్ వెంటనే మరమ్మత్తులు చేయాలని అధికారులకు సూచించారు. పాఠశాల ప్రాంగణంలో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని అన్నారు. పోతారం జడ్పిహెచ్ఎస్ పాఠశాల గ్రౌండ్ లెవెలింగ్ చేయాలని, కాంపౌండ్ వాల్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు. ముత్తారం ఎంపిపిఎస్ పాఠశాల వద్ద కూలిపోయే దశలో నిరుపయోగంగా ఉన్న 3 తరగతి గదులను తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ తనీఖీలలో జిల్లా కలెక్టర్ వెంట డివిజనల్ పంచాయతీ అధికారి కే సతీష్, ముత్తారం ఎంపీడీవో జి.లలిత, మండల పంచాయతీ అధికారి .బి.వేణుమాధవ్, పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ ఎం. వరలక్ష్మి, ఏపిఎం డి.పద్మ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media