Telugu Rekha Media - తెలంగాణ / భూపాలపల్లి : మోరంచవాగు పరిసరాలలో సాగవుతున్న పంటలు వరద ముంపుకు గురికాకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. శుక్రవారం జెన్కో సిఈ, సింగరేణి అధికారులతో కలిసి ఘణపురం మండల పరిధిలోని దుబ్బపల్లి శివారు మోరంచవాగు పరిసరాలు ముంపుకు గురయ్యే పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ గత సంవత్సరం జులై నెలలో వచ్చిన భారీ వర్షాలు కారణంగా మోరంచపల్లి గ్రామం మునిగిపోయి, భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ సంవత్సరం అలాంటి సంఘటనలు పునారావృతం కాకుండా జెన్కో అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతీ ఏటా ముంపుకు కారణమవుతున్న సమీపంలోని జామాయిల్ తోటను పూర్తిగా తొలగించాలని తెలిపారు. మోరంచవాగులో వెంటనే పూడిక తీత పనులు చేపట్టాలని ఆదేశించారు. మోరంచవాగును శుబ్రపరచాలని అలాగే నీళ్లు వేగంగా వెళ్లేందుకు వాగును వెడల్పు చేయాలని సూచించారు. జెన్కో యాష్ పాండ్ దగ్గర నిర్మించిన కాలువను వెడల్పు చేయాలని, దానికి సంబందించిన పనుల మంజూరుకు ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుందని వారం రోజులలోగా పనులు ప్రారంభించాలని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఇరిగేషన్, సింగరేణి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media