Telugu Rekha Media - తెలంగాణ / కరీంనగర్ : తెలంగాణ స్వయం పాలన ఆకాంక్షలకు ఊపురిలూదిన సాయుధ కాలపు తొలి అమరుడు దొడ్డి కొమురయ్య త్యాగం చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. గురువారం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య 78వ వర్ధంతిని పురస్కరించుకొని కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆ మహా యోధుడి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి తరతరాలుగా గుర్తుండిపోతుందని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కడివెండి గ్రామంలో ఒక సాధారణ కురుమ కులానికి చెందిన కుటుంబంలో జన్మించిన కొమురయ్య ఒక మహోన్నత ఉద్యమానికి ఆధ్యుడు అవడం తెలంగాణ ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు. అదేవిధంగా కురుమ, బీసీ సంఘాల నాయకులు దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, డిఆర్ఓ పవన్ కుమార్, బిసిడిఓ అనిల్ ప్రకాష్, అసిస్టెంట్ బీసీడీవో రాజ మనోహర్ రావు, కురుమ, బీసీ సంఘాల ప్రతినిధులు మీసా బీరయ్య, కర్రె పావని, కడారి ఐలయ్య, జక్కని సంజయ్ కుమార్, గుంటి స్వరూప, విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media