Telugu Rekha Media - తెలంగాణ / భూపాలపల్లి : గురువారం రేగొండ మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల, కస్తూరిబా గాంధీ విద్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ తరగతి గదుల్లో విద్యార్థుల భవితవ్యం రూపుదిద్దుకుంటుందని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన జరగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. గురువారం రేగొండ మండలంలో పర్యటించిన కలెక్టర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 11 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన కిచెన్ షెడ్ నిర్మాణం, బాలికల మరుగుదొడ్లు నిర్మాణ పనులను పరిశీలించి త్వరిత గతిన పూర్తిచేయాలని ఆదేశించారు. 6వ తరగతి విద్యార్థులతో మాట్లాడి పలు ప్రశ్నలు వేసి సమాదానాలు రాబట్టారు. వంట గదిని పరిశీలించి వెళ్లి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెరుగైన మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన అందించేందుకు చేపట్టిన మరమ్మతుల పనులను వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న జూనియర్ కళాశాల భవన నిర్మాణం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వంట గదిని పరిశీలించి మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని తెలిపారు. పదవ తరగతి గదిని పరిశీలించి విద్యార్థినులతో ఇంగ్లీష్ పాఠాలు చదివించారు. బాగా చదువుకొని మంచి ర్యాంకులు సాధించాలని సూచించారు. విద్య మాత్రమే మనిషిని ఉన్నత స్థితికి తీసుకురాగలదని కష్టంగా కాకుండా ఇష్టంగా చదవాలని సూచించారు. గురువులు చెప్పే పాఠాలను విద్యార్థులు శ్రద్ధగా విని ఏవేని సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలని తెలిపారు. విద్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, దోమలు, ఈగలు వ్యాప్తి జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. వ్యాధులు ప్రబలితే తక్షణమే వైద్యాధికారుల దృష్టికి తేవాలని, విద్యార్థులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఫార్మసి, ల్యాబ్, లేబర్ రూమ్, క్యాజువాలిటిని పరిశీలించి ఆసుపత్రి లో అందిస్తున్న వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇంటింటి జ్వర సర్వేనిర్వహించాలని జ్వరాలు ఎక్కువగా ఉన్న గ్రామాలలో మెడికల్ క్యాంపులు నిర్వహించి వ్యాధుల నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబల కుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈవో రాజేందర్, తహశీల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపిడిఓ వెంకటేశ్వర రావు, డాక్టర్ హిమబిందు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media