Telugu Rekha Media - తెలంగాణ / పెద్దపల్లి/మంథని : యువత గంజాయి, మత్తు పదార్థాల వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని మంథని సర్కిల్ ఇన్స్పెక్టర్ బొల్లపల్లి రాజు సూచించారు.శుక్రవారం రామగిరి మండలంలోని బేగంపేట గ్రామంలో రామగిరి ఎస్సై సందీప్ కుమార్, ముత్తారం ఎస్సై మధుసూదన్ ఆధ్వర్యంలో మంథని సర్కిల్లోని పోలీస్ సిబ్బందితో కార్టన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంథని సీఐ రాజు ముఖ్యఅతిథిగా హాజరై గ్రామ ప్రజలతో సమావేశం నిర్వహించారు. గ్రామంలోని ప్రజల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా సరైన పత్రాలు లేనటువంటి ద్విచక్ర వాహనాలను గుర్తించి వాటిపైన చాలాన్లు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో గంజాయి ఇతర మత్తు పదార్థాలు ఎవరైనా సేవించిన విక్రయించిన వారి వివరాలను పోలీసు వారికి చేరవేయాలని సూచించారు. వాటి వల్ల కలిగే అనర్ధాల గురించి ప్రజలకు వివరించి చెప్పారు.మైనర్ పిల్లలకు వాహనాలు ఇచ్చిన వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. అంతేకాకుండా సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించారు. మీకు తెలియని ఏదైనా ఫోన్ నెంబర్ నుండి కాల్స్ కానీ మెసేజ్ కానీ వచ్చి మిమ్మల్ని ఏవైనా ప్రలోభాలకు గురి చేసిన వెంటనే మీరు 1930 నెంబర్ కు కాల్ చేసి పోలీసు వారి సహాయం పొందాలన్నారు.సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఎవరైనా అనుచిత పోస్టులు పెట్టిన అట్టి వారి పైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామంలో ఎవరైనా అసాంఘిక చర్యలకు పాల్పడిన అట్టి వారి పైన చట్టరీత్యా చర్యలు ఉంటాయన్నారు. మహిళల పట్ల చిన్న పిల్లల పట్ల మర్యాదగా నడుచుకోవాలన్నారు.మీకు ఎటువంటి సమాచారం తెలిసిన తక్షణమే 100 నెంబర్ కు కాల్ చేసి పోలీస్ వారి సహాయం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలతో పాటు మంథని సర్కిల్ పరిధిలోని పోలీస్ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media